లక్నో: ఓటమి ఖాయమని అర్థమైన తర్వాత ఓడిపోయే రెజ్లర్ కాళ్లు, చేతుల్లో పట్టు కోల్పోతాడని, దాంతో సహనం నసిస్తుందని, అసహనంతో ప్రత్యర్థి రెజ్లర్ను కొరుకుతాడని, గీకుతాడని, ఒక్కోసారి గొంతుకూడా పిసుకుతాడని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అదేపని చేస్తున్నదని, ప్రస్తుతం బీజేపీది ఓడిపోయే రెజ్లర్ పరిస్థితేనని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీని అధికారం నుంచి పీకిపారేయబోతున్నారని అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. సమాజ్వాది పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టడం ద్వారా యూపీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. ప్రధాని మోదీ లాల్ టోపీ, లాల్ పొట్లి అంటూ సమాజ్వాది పార్టీపై చేసిన విమర్శలకు అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీకి గుణపాఠం చెప్పడం కోసం లాల్ టోపీ, లాల్ పొట్లి గింజగింజ సేకరించి పెట్టాయని వ్యాఖ్యానించారు. బీజేపీని కూలదోయడానికి యూపీ రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. యూపీ నుంచి బీజేపీని పెకిలించి వేయాలని తాము ప్రజలను కోరామని చెప్పారు. పశ్చిమ యూపీలో బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కదన్నారు.