హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్రం మాట తప్పింది. వందేభారత్ రైలు చక్రాల తయారీ ఆర్డర్ను ఉక్రెయిన్కు చెందిన ఓ సంస్థకు ఇచ్చింది. పైగా, యుద్ధ సమయంలోనూ ఉక్రెయిన్ నుంచి వందే భారత్ రైలు చక్రాలను తెప్పిస్తున్నామని గొప్పగా ప్రకటించుకొన్నది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘బీజేపీ నినాదం మేకిన్ ఇండియా.. కానీ దాని విధానం ఫేక్ ఇన్ ఇండియా’ అని విమర్శించారు.