Wheat Price | యావత్ దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. ఈ నెల 12న విజయదశమి, నెలాఖరులో దీపావళి వేడుకలు జరుగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ సైతం ప్రారంభం కానున్నది. ఈ పండుగలకు ముందు గోధుమల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోధుమలపై ప్రభుత్వం నియంత్రణ ఉన్నా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం పరోక్షంగా నిల్వలపై పరిమితి విధించింది. వ్యాపారులు ఎప్పటికప్పుడు నిల్వలపై సమాచారం అందించాలని కేంద్రం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. రెండునెలల్లో గోధుమల ధర క్వింటాల్కి రూ.200పైగా పెరిగింది. ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లో గోధుమలు క్వింటాల్కు రూ.3100 దాటింది.
ఈ పరిస్థితుల్లో గోధుమ పిండితో తయారయ్యే బ్రెడ్, మఫిన్స్, నూడుల్స్, పాస్తా, బిస్కెట్స్, కేకులు, కుకీలు తదితర ఉత్పత్తులపై ధరల ప్రభావం కనిపించే అవకాశం అందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గోధుమల ధరలు శ్రాద్ధ పక్షం నుంచి పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. మార్కెట్లోకి దిగుమతులు రాకపోతే దీపావళి నాటికి క్వింటాల్కి రూ.3500 దాటుతుందని అంచనా. పెళ్లిళ్ల సీజన్లో గోధుమల ధర క్వింటాల్కు రూ.4వేలు దాటుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే దిగుబడులు వచ్చేందుకు ఇంకా సమయం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా గోధుమ ధరలను నియంత్రించడానికి, బహిరంగ మార్కెట్ విక్రయం ద్వారా కనీసం 100 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి విడుదల చేయాలి.
దేశంలో గోధుమ నిల్వల గురించి మాట్లాడితే.. ఏప్రిల్ 1 నాటికి దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి. ఇది బఫర్ స్టాక్ కంటే కొంచెం ఎక్కువ. కాగా, ఈ ఏడాది ప్రభుత్వం 266 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. వీటిని కలిపితే ప్రభుత్వ సేకరణ ముగిసిన తర్వాత ప్రభుత్వం వద్ద 340 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. ప్రభుత్వ రేషన్ పంపిణీకి 185 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరం ఉంటుంది. ప్రభుత్వం వద్ద 155 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అదనంగా నిల్వ ఉన్నట్లు సమాచారం.