‘వో కుచ్భీ కహతే హై. లేకిన్ ఝేల్నా హమే హై. యహా పార్టీకీ స్థితీ కాఫీ కమ్జోర్ హై’ (ఆయనకేం.. ఏమైనా చెప్తారు. ఇక్కడ పరిస్థితులను ఎదుర్కోవాల్సింది మనమే. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బలహీనంగా ఉంది).. ఉచితాల గురించి గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. హిమాచల్ప్రదేశ్, గుజరాత్ స్థానిక బీజేపీ నేతలు అంతర్గత సమావేశాల్లో వెలిబుచ్చుతున్న అభిప్రాయాలివి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచిపెట్టే సంస్కృతి బాగా పెరిగిపోయిందని, ఉచితాల సంస్కృతిని అడ్డుకోవాలంటూ గత జూలైలో ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఉచితాల కారణంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చెందుతున్నారని అక్టోబర్లో మరోమారు గగ్గోలు పెట్టారు. అయితే, సంక్షేమ పథకాలను కూడా ఉచితాల కింద లెక్కగట్టిన ప్రధాని వ్యాఖ్యానాలకు బీజేపీ నేతలంతా అప్పుడు వంతపాడారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఆయా రాష్ర్టాల్లో విపక్ష కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా బీజేపీనేతలు మేనిఫెస్టోలో ఏం ప్రకటించాలో తెలియక మొన్నటివరకూ మిన్నకుండిపోయారు. ఇరురాష్ర్టాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదంటూ సర్వేల్లో తేలడం కమలదళాన్ని మరింత ఆత్మరక్షణలో పడేసింది. ఈ క్రమం లో గడిచిన రెండువారాల్లో ఆయా రాష్ర్టాల్లో జరిగిన పార్టీ అంతర్గత సమావేశాల్లో స్థానిక నేతలు మోదీ వ్యవహారశైలిపై అసహనంవ్యక్తం చేసినట్టు సమాచారం. ‘ప్రధాని మోదీకి స్థానికపరిస్థితుల గురించి ఏం తెలుసు? ఉచితాల గురించి ఆయన ఎన్నైనా చెప్తారు. ఇక్కడ పరిస్థితి మనకే తెలుసు. ప్రజలకు వరాలు ఇవ్వకపోతే మిగతావారికంటే వెనుకబడిపోతాం. ఎన్నికల్లో గెలువడం కష్టం. ఇప్పటికే పార్టీ అంతకంతకూ బలహీనమవుతుండటం మరిచిపోవద్దు’ అంటూ మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం.
స్థానిక నేతల డిమాండ్లు బీజేపీ అధిష్ఠానానికి చేరాయి. దీంతో గతవారం హిమాచల్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర నేతలతో చర్చించారు. అనంతరం హిమాచల్లో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. పేదింటి మహిళలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, 6-12 తరగతి విద్యార్థినులకు సైకిళ్లు, ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థినులకు స్కూటీ లు, రైతులకు రూ.3 వేలు, గర్భిణీలకు రూ. 25వేల ఆర్థికసాయం ఇస్తామం టూ వరాలు కురిపించారు. అయితే ఇవి ఉచితాలు కావని, మహిళాసాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏటా కుటుంబానికి ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ గుజరాత్కు చెందిన ఓ బీజేపీ నాయకుడు కూడా ప్రకటించాడు. అయితే, ప్రచారానికి వెళ్తున్న బీజేపీ స్థానిక నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మోదీనే ఉచిత ప్రకటనలు వద్దంటూ బహిరంగంగా పేర్కొన్నప్పుడూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలానెరవేరుస్తారని, దీనికి గ్యారం టీ ఏమిటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.