బరాసత్: పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పార్గనాస్లో ఉన్న బరాసత్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. టీఎంసీ ప్రభుత్వ హయాంలో.. ఈ నేల మహిళలు వేధింపులకు గురైనట్లు ఆయన ఆరోపించారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన సిగ్గుచేటు అని, స్థానిక టీఎంసీ సర్కారు మీ బాధలను పట్టించుకోవడం లేదన్నారు. సందేశ్ఖాలీలో అకృత్యాలకు పాల్పడిన వ్యక్తిని టీఎంసీ రక్షిస్తోందని విమర్శించారు. ఈ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయన్నారు. టీఎంసీ నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. టీఎంసీకి తమ నేతల పట్ల పూర్తి విశ్వాసం ఉందని, కానీ బెంగాల్ మహిళల పట్ల లేదని ఆయన అన్నారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేయనున్నట్లు ఆయన చెప్పారు.
మరో వైపు మోదీ సభ కోసం సందేశ్ఖాలీ మహిళలతో వెళ్తున్న బస్సులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సెక్యూర్టీ ప్రోటోకాల్ వల్ల వాహనాలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బిశ్వ బంగ్లా గేటు వద్ద తొలుత బస్సులను ఆపేశారని, ఆ తర్వాత ఎయిర్పోర్టు గేట్ 1 వద్ద ఆపారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్లకుండా తమను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.