Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరి సిద్ధూ జీవితం పటియాలా సెంట్రల్ జైల్లో ఎలా ఉండబోతోంది..? ఏయే సౌకర్యాలు, ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు..? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే పటియాలా సెంట్రల్ జైల్లో ఉండే అందరూ ఖైదీలకు ఒకే రకమైన సౌకర్యాలు, సదుపాయాలు ఉండనున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
జైళ్లలో వీఐపీ కల్చర్కు తెరదింపామని జైల్స్ మినిస్టర్ హర్జోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. ఒకే పరిస్థితుల్లో అందరూ ఖైదీలు ఉండాలనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే విధానం సిద్ధూకు కానీ, మరొకరికి కానీ వర్తిస్తుందన్నారు.
నవజోత్ సింగ్ సిద్ధూ ప్రధాన ప్రత్యర్థి, అకాలీ లీడర్ బిక్రమ్ మజితియా కూడా పటియాలా సెంట్రల్ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నాడు. బిక్రమ్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. బిక్రమ్ అరెస్టులో సిద్ధూ ప్రధాన పాత్ర పోషించారు. బిక్రమ్పై డ్రగ్స్ కేసులో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధూ కీలకంగా వ్యవహరించారు.
ఉదయం 5:30 గంటలకే లేవాలి. 7 గంటలకు టీతో పాటు బిస్కెట్లను ఖైదీలకు అందిస్తారు. 8:30 గంటలకు ఆరు చపాతీలు, ఆకుకూరలతో అల్పహారం ఇస్తారు. అనంతరం ఖైదీలు తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నమైపోతారు. సాయంత్రం 5:30 గంటలకు తమ పనులను ముగించుకొని.. తిరిగి బ్యారక్లకు చేరుతారు. సాయంత్రం 6 గంటలకు డిన్నర్లో భాగంగా ఆరు చపాతీలు, పప్పుదినుసులు, కూరగాయలతో కూడిన భోజనం అందిస్తారు. రాత్రి 7 గంటలకు ఖైదీలు తమ బ్యారక్లలోకి వెళ్లిపోతారు.
మూడు నెలల పాటు ఎలాంటి జీతం లేకుండా దోషులు వారికి కేటాయించిన పనుల్లో శిక్షణ పొందుతారు. మూడు నెలల తర్వాత నైపుణ్యం లేని, నైపుణ్యం కలిగిన ఖైదీలుగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత రోజుకు రూ. 30 నుంచి రూ. 90 దాకా కూలీ చెల్లిస్తారు. ఈ క్రమంలో జైలు నిబంధనల ప్రకారం.. సిద్ధూకు మూడు నెలల పాటు శిక్షణ అందించి, అతను ఏ వర్గానికో సరిపోతాడో నిర్ణయించి, పనులను కేటాయిస్తారు.
సిద్ధూ ఎడ్యుకేటెడ్ పర్సన్. మరి అతనికి సరిపోయే పనినే కేటాయిస్తారు. వ్యవసాయంతో పాటు బిస్కెట్ల తయారీ లేదా ఫర్నీచర్ కంపెనీలో ఆయనకు పలి కల్పిస్తారా? లేక లైబ్రరీలో ఎంప్లాయ్గా నియమిస్తారా? అనేది సిద్ధూకు శిక్షణ పూర్తయిన తర్వాతనే తెలియనుంది.
ఇక సిద్ధూనేమో కలర్ ఫుల్ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడూ ట్రెండ్ను ఫాలో అవుతుంటారు. పటియాలా జైల్లో మాత్రం ఖైదీలందరూ తెల్లని దుస్తులు తప్పనిసరిగా ధరించాల్సిందే.
జైలు నిబంధనల ప్రకారం.. సిద్ధూకు నాలుగు నెలల తర్వాత పెరోల్ లభించే అవకాశం ఉంది. అది కూడా అతని సత్పవర్తనను బట్టి జైలు అధికారులు పెరోల్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పెరోల్ 28 రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉంది.