Shinde-Udhav Thackeray | మహారాష్ట్రలో అధికార కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఏక్నాథ్ షిండే గ్రూప్ తిరిగి పార్టీలోకి వస్తారని చెప్పినట్లు సమాచారం. `నేను ఏక్నాథ్ షిండేతో చర్చించా. ఆయన తిరిగి వస్తారు. ఎన్సీపీ కూడా మనతోనే ఉంటుంది` అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని శివసేన నేతలు చెప్పారు.
ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు తిరిగి పునరుద్ధరించాలని, తద్వారా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ఉద్ధవ్ ఠాక్రేను ఏక్నాథ్ షిండే డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. `కొందరు నేతలు బీజేపీతో కలిసి వెళ్లాలని అంటున్నారు. కానీ మనం ఆ పని ఎలా చేయాలి. వారి (బీజేపీ)తో ఉన్నప్పుడు దెబ్బ తిన్నాం. వారితో ఎందుకు కలిసి వెళ్లాలి` అని ఠాక్రే సమావేశంలో అన్నారని సమాచారం. ఎమ్మెల్యేలంతా మనతోనే ఉంటారని పేర్కొంటూ ఉద్ధవ్ ఠాక్రే ఐక్యతా మంత్రం పఠించారని తెలుస్తున్నది.
ఒకవేళ పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా అధికార శివసేనలో చీలిక తేవాలంటే ఏక్నాథ్ షిండేకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందుకు సరిపడా మెజారిటీ షిండేకు లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 55 మంది సభ్యులు ఉన్న శివసేనలో 21 మంది మద్దతు కూడగట్టుకున్న ఏక్నాథ్ షిండే.. మరింత మంది తనకు మద్దతు ఇస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఒకవేళ శివసేనలో చీలిక వస్తే ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది.