CM KCR | విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. నాందేడ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు ఒకే రోజు 2,15,888 మెగావాట్లుకు మంచి వాడలేదన్నారు. 4,10లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉందన్నారు. అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీరు, విద్యుత్ కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనుకబడి ఉందని, సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. వ్యాపారం మా విధానం కాదని మోదీ చెబుతున్నారని, ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మన దేశంలో బొగ్గు నిల్వలతో 125 సంవత్సరాల పాటు దేశమంతా విద్యుత్ ఇవ్వొచ్చన్నారు.
విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 90శాతం విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సంస్థలను విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పుష్కలంగా బొగ్గు ఉంటే విదేశాల నుంచి ఎందుకు కొనుగోలు చేయాలన్నారు. విద్యుత్ని ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 3 గంటలు
కూడా ఉండడం లేదన్నారు. విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధి ఇండెక్స్కి ప్రమాణికం అని అన్నారు. ఇందులో భారత్లో పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, 24 గంటలు అన్ని వర్గాలకు విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్లో కరెంటు పోవచ్చు గానీ హైదరాబాద్లో పోదన్నారు.
దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ ప్రజలకు ఏవీ అందవన్నారు. కేంద్రం ప్రైవేటీకరించిన విద్యుత్ సంస్థలను మళ్లీ జాతీయం చేస్తామన్నారు. దేశంలో 90శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతామని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేళ్లలోనే దేశంలో నిరంతర వెలుగులు నింపుతామన్నారు. దేశంలో రోడ్లు, షిప్యార్డులు, ఎయిర్పోర్టులు ఏవీ సరిగా లేవన్నారు. మన దేశంలో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లని, చైనాలో 120 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఏమైనా అంటే దేశం కోసం.. ధర్మం కోసమని గగ్గోలు పెడుతారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బొగ్గు గనులన్నీ ప్రాంతాలకు రైల్వేలైన్లు వేస్తామన్నారు. రైల్వేలైన్ల కోసం కోల్ ఇండియా నిధులు ఇచ్చినా, కేంద్రం వేయలేదన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం జబర్దస్తీ ఏంటని ప్రశ్నించారు. అదానీ ప్రయోజనం కలిగించేందుకు బొగ్గు దిగుమతికి ఒత్తిడి తెస్తున్నారన్నారు. దేశంలో బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదన్నారు.