న్యూఢిల్లీ: జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇది జనాభాలో సంభవించే మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను సర్దుబాటు చేసి, సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయాల్సిన సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది.
జనాభా పెరుగుదలను పార్లమెంటరీ బలంతో సమతుల్యం చేస్తూ, సమాన ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి జన గణన తర్వాత తాజా గణాంకాలకు అనుగుణంగా పార్లమెంటరీ సీట్లు, నియోజకవర్గాల సరిహద్దులను పునః సమీక్షించడానికి పునర్విభజన తప్పనిసరిగా చేయాలి. రాజ్యాంగంలోని అధికరణ 82, 170 ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం సీట్ల సంఖ్య, సరిహద్దులను సవరిస్తూ ఉండాలి.
మన దేశంలో ఆఖరిసారిగా డీలిమిటేషన్ను 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో నిర్వహించారు. అయితే ఫ్రీజింగ్ కారణంగా సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. అంతకుముందు 1952, 1963, 1973 (1975లో అమలు చేశారు)లలో డీలిమిటేషన్ చేపట్టారు. వాస్తవానికి 2021 డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, కొవిడ్ కారణంగా జనగణన చేపట్టకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది.
జనాభా నియంత్రణను ప్రోత్సహించడానికి, అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ర్టాలు ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి 1971 జనాభా లెక్కల నుంచి లోక్సభ సీట్లను స్తంభింపచేశారు. 42వ రాజ్యాంగ సవరణ (1976) డీలిమిటేషన్ను 25 ఏండ్ల పాటు వాయిదా వేయగా, 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 2021 వరకు పొడిగించారు. నేటి లోక్సభ (543), రాజ్యసభ (250) సీట్లు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి.
