Aditya L1 | సూర్యుడి చుట్టూ 5 లెగ్రాంజియన్ పాయింట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వీటి గురించి మొదట వివరించింది ఇటాలియన్ – ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్. 1772లో తన ప్రఖ్యాత పరిశోధన పత్రం ఎస్సే సుర్లీ ప్రాబ్లమే డెస్ ట్రోయిస్ కార్ప్స్లో వీటి గురించి వివరించారు. ఆయన గౌరవార్థం ప్రదేశాలకు లెగ్రాంజ్ పాయింట్లని పేరు పెట్టారు. రెండు భారీ ద్రవ్యరాశుల మధ్య స్థిరమైన గురుత్వాకర్షణ శక్తి ఉండే ప్రదేశాన్నే లెగ్రాంజియన్ పాయింట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడికి భూమికి మధ్య ఒక చిన్న వస్తువును ఏ ప్రదేశంలో ఉంచితే అది సొంత శక్తి అవసరం లేకుండా సూర్యుడు, భూమి వెంట సహజంగా సాగిపోతుందో ఆ ప్రదేశాన్నే లెగ్రాంజ్ పాయింట్ అంటారు.
అంటే.. ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఆ వస్తువును తమవైపు లాగేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రెండింటి బలం సమానంగా ఉంటే.. మధ్యలో ఉండే వస్తువు ఎటూ కదలకుండా అక్కడ నిలబడుతుంది కదా! అదే ఈ పాయింట్. ఇలాంటి ప్రదేశాలు భూమి, సుర్యుడికి మధ్య 5 ఉన్నాయి. వీటిని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4, ఎల్ 5 అని పిలుస్తున్నారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అస్థిర పాయింట్లు కాగా, ఎల్ 4, ఎల్ 5 స్థిర పాయింట్లు. ఇప్పుడు ఆదిత్య ఉపగ్రహాన్ని ఇస్రో ఎల్ 1 వద్ద ఉంచనున్నది. ఈ పాయింట్కు ఓ ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ఉండే ఏ ఉపగ్రహమైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలించవచ్చు. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సూర్యుడు, భూమి వెంట అలా సాగిపోవచ్చు. అందుకే ఆదిత్య ఉపగ్రహాన్ని ఇస్రో ఇక్కడ ఉంచాలని నిర్ణయించింది.