UP Polls | ములాయం కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. చేరిన తర్వాత మొదటి సారిగా ఆమె సమాజ్వాదీ మార్గదర్శకుడు ములాయంతో భేటీ అయ్యారు. ఆయన నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. అయితే ఇంతకు ములాయం యాదవ్ ఏమని ఆశీర్వదించారు. ఈ విషయాన్నీ అపర్ణ యాదవే వెల్లడించారు. సంతోషంగా వుండు బిడ్డా అంటూ ఆశీర్వదించారు. ఆ తర్వాత రాజకీయాల్లో మనగలగడానికి కావాల్సిన టిప్స్ను కూడా ఇచ్చారు. ఆనందంగా ఉండు. బీజేపీలో చేరిన విషయంపై మళ్లీ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అని అన్నారని అపర్ణ పేర్కొన్నారు.
అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో అపర్ణ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. దేశం ఎప్పుడూ మొదటి స్థానంలోనే వుంటుందని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశమయ్యారు.