న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. గత ఎనిమిది రోజులుగా రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యలు ప్రారంభించిన అనంతరం పలు దేశాల్లో మాస్కోపై ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడుత పంజాబ్ సెక్టార్లోకి క్షిపణి వ్యవస్థను సరఫరా చేసింది. అయితే, ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్తో డీల్పై సందిగ్ధం నెలకొంది.
ఈ క్రమంలో రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు మాస్కోపై విధించిన ఆంక్షలు భారత్కు ఎస్-400 క్షిపణి వ్యవస్థల సరఫరాపై ప్రభావం చూపవని, వందశాతం హామీ ఇస్తున్నామన్నారు. అయితే, ఆర్థిక సహకారానికి సంబంధించి, వాణిజ్యంపై విధించిన తీవ్రమైన ఆంక్షల ప్రభావం అంతిమంగా ఎలా ఉండబోతుందో చూద్దామన్నారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని, ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని ఎదుర్కొంటామన్నారు. ఇదిలా ఉండగా.. 2018లో భారత్ రష్యాతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ను కొనుగులో చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అప్పటి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ ఒప్పందం చేసుకున్నది. ఇప్పటికే రష్యా మిస్సైల్ వ్యవస్థను సరఫరా ప్రారంభించింది.
ఎస్-400 ట్రయాంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా మోహరించవచ్చు. ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చివేయగల సామర్థ్యం వీటికి ఉంది. విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తక్షణమే వీటిని 1993లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మిస్సైల్ స్టోరేజ్ కంటైనర్లు, లాంచర్లు, రాడార్లు ఇలా వివిధ రకాల ఆయుధాలతో దీన్ని తయారు చేశారు. 2007వ సంవత్సరంలో ఇది వినియోగంలోకి వచ్చింది.