న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు విచారణను మే 6కి వాయిదా వేసింది. 25,753 ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ట్రప్రభుత్వమా?
సందేశ్ఖాలీ దారుణాల కేసులో ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ పిటిషనర్గా కోర్టుకు రావడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సందేశ్ఖాలీలో భూ కబ్జాలు, మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ ఏప్రిల్ 10న కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది.
సీఏ పరీక్షల వాయిదాకు నిరాకరణ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెన్సీ(సీఏ)లో కొన్ని పేపర్లకు సంబంధించి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పోలింగ్ తేదీల్లో (మే 7, మే 13) సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించటం లేదన్న విషయాన్ని గుర్తుచేసింది. పరీక్షల షెడ్యూల్ ‘విధానపరమైన నిర్ణయం’ అంటూ పిల్ని తిరస్కరించింది.
గర్భవిచ్ఛిత్తి కేసు తీర్పు ఉపసంహరణ
లైంగిక దాడి కారణంగా గర్భవతి అయిన 14 ఏళ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి చేయడానికి ఇటీవల ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు సోమవారం ఉపసంహరించింది. 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు గర్భస్రావం చేసినట్లయితే, ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, ఆమెకు జన్మించే బిడ్డను సంరక్షిస్తామని, ఆమె తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో సర్వోన్నత న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది.
దవాఖానల్లో రేట్ల నిర్ణయంపై పిల్
దవాఖానల్లో రోగుల నుంచి వసూలు చేయదగిన రేట్లను నిర్ణయించడానికి సంబంధించిన నిబంధనను అమలు చేయవద్దని కోరుతూ పిల్ దాఖలైంది. దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు ఇచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రూల్స్, 2012లోని తొమ్మిదో నిబంధనను అమలు చేయరాదని పిటిషనర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి కేంద్రం నిర్ణయించే ధరల మేరకే రోగుల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఈ నిబంధన చెప్తున్నది.
నీట్ పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీ పొడిగింపునకు నో
ఈ ఏడాది జూన్ 23న జరగనున్న నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇది పూర్తిగా విధానపరమైన అంశంగా సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘కటాఫ్ ఉన్నప్పుడు అభ్యర్థులు ఎవరన్నది తేల్చే నిర్దిష్టమైన రేఖ ఏర్పడుతుంది’ అని సీజేఐ అన్నారు.