కోల్కతా : కరోనా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనంతో లాక్డౌన్ నియంత్రణలను ఆగస్ట్ 30 వరకూ పొడిగించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకూ లోకల్ ట్రైన్స్ను నడపరాదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఇక తాజాగా బెంగాల్లో 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి ఆరుగురు మరణించారు. ఇక డార్జలింగ్, జల్పాయిగురి, పర్బ మేదినిపూర్ జిల్లాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.