హైదరాబాద్: వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మమతాబెనర్జి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఇవాళ ఆమె గోవాకు చేరుకున్నారు. దబోలిమ్లోని గోవా ఎయిర్పోర్టుకు చేరుకున్న మమతకు స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మమతాబెనర్జి మూడు నుంచి నాలుగు రోజుల వరకు గోవాలోనే మకాం వేయనున్నారని గోవా టీఎంసీ నేత లావూ మామ్లేదార్ చెప్పారు.
ఈసారి ఎలాగైనా గోవాలో అధికారం చేజిక్కించుకోవాలని మమతబెనర్జి ధృడ సంకల్పంతో ఉన్నారు. అందుకే రాష్ట్రంలో నాలుగు రోజులు మకాం వేసి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అదేవిధంగా వివిధ నియోజవర్గాల్లో గెలుపు అవకాశం ఉన్న అభ్యర్థులు ఎవరనే విషయంలో కూడా మమత ఒక అవగాహనకు రానున్నారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఎంసీలోకి వచ్చే అవకాశం ఉన్న నేతల విషయంపై కూడా మమతాబెనర్జి చర్చించనున్నారు. ప్రజల్లో పట్టున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా టీఎంసీలోకి ఆహ్వానించాలని ఆమె భావిస్తున్నారు. ఇలా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి గోవా ముఖ్యమంత్రి పీఠంపైనా టీఎంసీ నాయకుడిని కూర్చోబెట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో అధికారమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.