కోల్కతా : పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం కేసులో మరో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా, బొంగావ్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ శంకర్ ఆద్యను శనివారం ఉదయం ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, కోల్కతాలోని ఈడీ కార్యాలయానికి తరలించారు.
శనివారం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో 17 గంటలపాటు సోదాలు నిర్వహించి, రూ.8 లక్షలు నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయనను అరెస్ట్ చేసి, తీసుకెళ్తుండగా, ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపై రాళ్లు రువ్వి, వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంగా ఆద్య మీడియాతో మాట్లాడుతూ, తాను దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు.