Weather Update | నైరుతి రుతుపవనాలు తిరుగోమనానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి, జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, కేరళ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో వైపు రాగల రెండు రోజుల్లో 25 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు ఎల్లో, మరికొన్ని రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో శనివారం పలురాష్ట్రాల్లో భారీ వర్షాపాతం నమోదైందని తెలిపింది. రాగల రెండురోజుల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వివరించింది.