న్యూఢిల్లీ : చలిగాలులతో ఉత్తరభారతం వణుకుతున్నది. హిమాలయ పర్వతాల నుంచి వస్తున్న శీతల గాలుల కారణంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం చలి భారీగా పెరిగింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో గత కొద్ది రోజులుగా చలి గాలులు వీస్తున్నాయి. వాతావరణశాఖ ప్రకారం.. శనివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలుగా నమోదైంది. కాగా, ఆదివారం ఉదయం ఆరు డిగ్రీలకు చేరింది.
సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఉదయం ఏడు గంటలకు ఉష్ణోగ్రత 4.4 డిగ్రీలకు పిపోయింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత. మరో వైపు రాబోయే మూడు రోజులు ఢిల్లీని చలిగాలులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 18-19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా ఆదివారం చురులో 2.6, గంగానగర్లో 3.5, నార్నాల్ 1.2, హిసార్ 2, సఫ్దర్జంగ్ (ఢిల్లీ) 4.6 డిగ్రీలుగా నమోదైంది.
హిమాచల్ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాలను మంచుదుప్పటి కమ్మేసింది. శనివారం రాత్రి, చురులో ఉష్ణోగ్రత మైనస్ 1.1, మౌంట్ అబూలో మైనస్ 3, జాబ్నర్లో మైనస్ 2 డిగ్రీలకు చేరగా.. ఈ సీజన్లో అత్యంత చలిదినంగా నిలిచింది. జైపూర్లోని జాబ్నర్ పట్టణంలో ఇప్పటివరకు ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఆదివారం నగరంలో తొలిసారిగా ఉష్ణోగ్రత మైనస్ 5 డిగ్రీలకు చేరింది. శ్రీకరణ్ నరేంద్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని వాతావరణ అబ్జర్వేటరీలోని ఓపెన్ పాన్లోని నీరంతా గడ్డకట్టింది. హిమాచల్ప్రదేశ్లోని పలు నగరాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భారీ హిమపాతం కారణంగా గత 24గంటల్లో ఏడు నగరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్కు చేరాయి.