IMD Weather Report | భారత్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్లో వేడి పెరుగుతూ వస్తున్నది. మధ్య మహారాష్ట్ర, దిగువ స్థాయి నుంయి కొమోరిన్ ప్రాంతం దిశగా ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. ఛత్తీస్గఢ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహేలోని వివిధ ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
మధ్యప్రదేశ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడలోని వివిధ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మెరుపులు, వడగళ్లు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని మైదానాలు, గుజరాత్లోని పలు చోట్ల జల్లులుపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఉత్తరభారతంలో వేడి పెరుగుతోందని తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయని.. రాబోయే రెండు-మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. ఫలితంగా రాబోయే ఐదురోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పర్వతాల నుంచి మైదానాల వరకు ఎండలు మండుతున్నాయి. రాబోయే ఆరు రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే మధ్య భారతదేశం, మహారాష్ట్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే రెండు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల దాకా తగ్గే అవకాశం ఉందని.. ఆ తర్వాత నాలుగు రోజుల్లో నాలుగు డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ఈ నెల 7 వరకు రాజస్థాన్లో వడగాలులు వీస్తాయని, గుజరాత్లో వేడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ఏప్రిల్ 1న, సౌరాష్ట్ర, కచ్లోని సురేంద్రనగర్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలుగా నమోదైంది. ఇక అరుణ్చల్ ప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత్-మయన్మార్ను కలిసే జాతీయ రహదారి 113 తెగిపోయింది. దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.