న్యూఢిల్లీ: భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఆదివారం పేర్కొన్నారు. 2022-23లో దేశంలో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఇది 2023-24లో తగ్గుతుందని అశిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆర్థిక అభివృద్ధి మాత్రం ఆందోళనకరంగా ఉన్నదని, ద్రవ్య అలభ్యత డిమాండ్ను కుదించిందని తెలిపారు. ద్రవ్య లభ్యతలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థితిని దేశమంతా ఎదుర్కొంటున్నదని వివరించారు. ఒక పక్క పెరుగుతున్న ఈఎంఐల భారం ప్రతి కుటుంబ బడ్జెట్లపై ఒత్తిడి పెంచాయని, ఖర్చులను తగ్గించాయని పేర్కొన్నారు.