న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు భారీ ప్రోత్సహాకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవాళ ఓ భారీ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా సుమారు పది వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన మీడియాతో వెల్లడించారు. రాబోయే 12 నెలల్లో సుమారు రెండు వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత రెండేళ్లలో మరో ఎనిమిది వేల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. మూడేళ్లలోనే పది వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణ టార్గెట్ను అందుకోనున్నట్లు ఐఓసీ చైర్మన్ వైద్య తెలిపారు. గత నెలలో టాటా పవర్ కూడా ఓ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 వేల పెట్రోల్ పంపుల వద్ద కనీసం ఒక ఈవీ ఛార్జింగ్ యూనిట్ను పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.