న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షించనున్నట్లు తెలిపింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 124ఏ చట్టాన్ని సంపూర్ణంగా సమీక్షించనున్నట్లు కేంద్రం కోర్టుకు విన్నవించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో పాతకాలం చట్టాలను రద్దు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టాన్ని కూడా రద్దు చేయాలని భావించారు. కానీ ఆ చట్టాన్ని మళ్లీ సమీక్షించనున్నామని, ఆ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దనున్నట్లు ఇవాళ సుప్రీంకు కేంద్రం చెప్పింది.
124ఏ సెక్షన్పై పూర్తిగా స్టడీ చేసే వరకు సుప్రీం వేచి ఉండాలని కేంద్రం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న వారిపై దేశద్రోహ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గత ఏడాది కేంద్రంపై ఆరోపణలు వచ్చాయి. అయితే బ్రిటీష్ కాలంలో మహాత్మా గాంధీ లాంటి వారిని సెలెంట్ చేసేందుకు ఈ చట్టాలను వాడారని, ఎందుకు ఆ చట్టాలను రద్దు చేయడంలేదని ఇటీవల సుప్రీం కూడా ప్రశ్నించింది. 1962లో దేశద్రోహ చట్టంపై వచ్చిన తీర్పుపై సమీక్షించేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపేందుకు సుప్రీం ఆలోచిస్తోంది.