ముంబై, జూన్ 3: పీఎం కేర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పనిచేయకుండా ఎవరైనా కరోనా రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. పీఎం కేర్ నిధుల ద్వారా గుజరాత్ నుంచి కొనుగోలు చేసి తమకు పంపిన వెంటలేటర్లలో కొన్ని పనిచేయడం లేదని, వాటికి రిపేర్లు చేసినా అదే పరిస్థితి ఎదురవుతున్నదని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘లోపభూయిష్టమైన వెంటిలేటర్లను ఉపయోగించడం వల్ల కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా వారి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలి. ఒకవేళ ఇలాంటి వెంటిలేటర్ల వల్ల రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదే’ అని ధర్మాసనం పేర్కొంది.