ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ‘దొంగ మార్కెట్’ను నాశనం చేస్తామని శివసేన (యూటీబీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. గతంలో తమ స్నేహాన్ని చూసిన బీజేపీ ఇప్పుడు తమ ఎన్నికల గుర్తైన కాగడ మంటల సెగ చూస్తుందని మండిపడ్డారు. ఆదివారం ముంబై సబర్బన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ ఏ ఉద్యమంలోనూ, పోరాటంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. ‘స్వాతంత్ర్య ఉద్యమంలో, సంయుక్త మహారాష్ట్ర పోరాటంలో లేదా మరాఠ్వాడా ముక్తి సంగ్రామంలో బీజేపీ భాగం కాలేదు. దానికి లాక్కోవడమే తెలుసు. ఎన్నికల్లో బీజేపీ ‘చోర్ బజార్’ను నాశనం చేస్తాం. అది (బీజేపీ) మా స్నేహాన్ని చూసింది. ఇప్పుడు మన ‘మషాల్’ (ఎన్నికల చిహ్నమైన కాగడ) వేడిని చూస్తుంది’ అని అన్నారు.
కాగా, బీజేపీ అవినీతి కార్యక్రమాల్లో భాగం కావద్దని ముంబై పౌర అధికారులను ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ముంబై వాయువ్య లోక్సభ స్థానం అభ్యర్థి అమోల్ కీర్తికర్ అని పునరుద్ఘాటించారు. మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్ కుమారుడు అమోల్ను అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంపై 2019లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.