BBC documentary | ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దేశంలోని అన్ని సోషల్ మీడియా సైట్ల నుంచి డాక్యుమెంట్లను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. తాజాగా బీబీసీకి అగ్రరాజ్యం అమెరికా మద్దతు తెలిపింది. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలైన భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు మద్దతు ఉంటుందని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తాము బలంగా నమ్ముతున్నామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.
కేవలం ఈ విలువల ఆధారంగానే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఇందుకు భారత్ మినహాయింపు కాదన్నారు. అమెరికా – భారత్ మధ్య రాజకీయ, ఆర్థిక, ప్రజానుబంధాలు కొనసాగుతున్నాయంటే ఇందుకు కారణం ఇరు దేశాలు ప్రజాస్వామ్య విలువలను గౌరవించడమేనన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ తనకు తెలియదన్న ఆయన.. అయితే, భారత్ – అమెరికా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చెబుతున్నానన్నారు.
ప్రజాస్వామ్య దేశాలు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా వాటిపై నిలదీస్తామన్నారు. ఇదిలా ఉండగా.. గతవారం యూకే ప్రధాని రిషి సునాక్ ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారు. బీబీసీ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీ కారణం అని చెప్పిన డాక్యుమెంటరీతో తాను అంగీకరించబోనన్నారు. యూకే పార్లమెంటులో బీబీసీ డాక్యుమెంటరీపై చర్చ జరగ్గా.. ఆ సమయంలో పాక్ సంతతి ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ గుజరాత్ అల్లర్ల పై ప్రస్తావించిన సందర్భంలో రిషి సునాక్ స్పందించారు. బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై రెండు భాగాలున్న డాక్యుమెంటరీని ఇటీవల విడుదల చేసింది.
గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ప్రస్తుత ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అల్లర్లకు ప్రధాన కారణం మోదీనే అని పేర్కొంటూ బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇక ఈ డాక్యుమెంటరీ విడుదల కాగానే వివాదాలకు దారి తీసింది. ఆ తర్వాత కేంద్రం ప్రభుత్వం బీబీసీ సిరీస్ భారత్లో స్క్రీనింగ్ కాకుండా ఆదేశాలిచ్చింది. సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయిన వీడియోలను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రధాని మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్న లక్ష్యంతో బీబీసీ ఈ వీడియోను విడుదల చేసిందని విదేశీ వ్యవహారాల శాఖ స్ఫష్టం చేసింది.