న్యూఢిల్లీ: నేరపూరిత పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రాతినిధ్యం వహించే కేరళలోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం సీటుకు ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీ ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ అంశంపై సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) స్పష్టతనిచ్చారు. ఆ అంశంలో తమకు తొందర ఏమీ లేదన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్న సమయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏర్పడిన ఖాళీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీకి చెందిన వేకన్సీ(vacancy) విషయం మార్చిలో నోటిఫై అయ్యిందని, కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఆయనకు 30 రోజుల సమయం ఇచ్చారని, వయనాడ్ నియోజకవర్గ ఎన్నిక విషయంలో తామేమీ తొందరపడడం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951(Representation of The People Act, 1951) ప్రకారం .. ఖాళీ ఏర్పడిన ఆరు నెలల లోపు బైపోల్స్ నిర్వహించుకోవచ్చు అని అన్నారు.
డిఫమేషన్ కేసు(defamation case)లో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఒకవేళ ఈ కేసులో ఆయన స్టే దక్కితే, అప్పుడు సభ్యత్వాన్ని పునరుద్దించే అవకాశాలు ఉంటాయి. అటువంటి దశలో ఉప ఎన్నికతో అవసరం ఏమీ ఉండదు. అయితే రాహుల్ తరహాలోనే వేటుకు గురైన లక్షద్వీప్ ఎంపీ ఫైజల్కు ఇవాళ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్దరించారు.