అదనపు జలాల కోసం
హర్యానాకు ప్రభుత్వం లేఖ
న్యూఢిల్లీ, మే 4: అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమునా నదిలో ప్రవాహం తక్కువగా ఉండటంతో ఢిల్లీకి ఒక ప్రధాన నీటి వనరుగా ఉన్న వజీరాబాద్ బరాజ్లో నీటిమట్టం పడిపోయింది. దీంతో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నేపథ్యంలో అదనపు జలాలను విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీ సర్కార్ హర్యానాకు లేఖ రాసింది.
వజీరాబాద్ సాధారణ నీటి మట్టం 674.5 అడుగులు. అయితే ఇది బుధవారం ఉదయానికి 672.3 అడుగులకు పడిపోయిందని అధికారి ఒకరు పేర్కొన్నారు. క్యారియర్ లైన్ కెనాల్లో రా వాటర్ ప్రవాహం 683 క్యూసెక్కుల నుంచి 566 క్యూసెక్కులకు పడిపోయిందని, దీని వల్ల తాగునీటి ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.