ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నదీ తీర ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నాసిక్ నగరంలో గోదావరి నది వెంబడి ఉన్న పలు ఆలయాలు ( Nashik Temples ) వరదనీటిలో మునిగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని, ఈ ఉదయం ఆ వాయుగుండం ఒడిశా తీరాన్ని తాకిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆ వాయుగుండం ప్రభావంతో దేశంలోని పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ప్రస్తుతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఆ వాయుగుండమే కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.