కోల్కతా: ప్రమాదవశాత్తు మనుషులు, పశువులు రైలుకింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి చాలాసార్లు వింటుంటాం. అడవుల్లో కూడా తరచూ మూగజీవాలు రైళ్ల కిందపడి మరణిస్తుంటాయి. ఇలా ఏనుగులు, సింహాలు, పులులు, రైనోలు రైళ్లకింద పడి చనిపోయిన ఘటనలు అప్పుడప్పుడు పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా ఓ రైలు లోకోపైలెట్లు మాత్రం ఓ గజరాజును రక్షించారు. వాళ్లు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే ఆ ఏనుగు కూడా ప్రాణాలు కోల్పోయేదే.
ఇంతకూ ఏం జరిగిందంటే.. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్ ఉత్తర బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ట్రాక్ పక్కన ఓ ఏనుగు నిలబడి ఉంది. దూరం నుంచి దాన్ని గమనించిన లోకోపైలెట్లు వెంటనే రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ దగ్గరి నుంచి అడవిలోపలికి వెళ్లేవరకు వేచిచూసి ఆ తర్వాత రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అలీపూర్ద్వార్ డివిజన్ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు.
ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి లోకో పైలెట్లపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారంటూ వారిని మెచ్చుకుంటున్నారు. అటు రైల్వే శాఖ కూడా ఇద్దరు లోకో పైలెట్లను అభినందించింది.
While working 03150Dn KanchanKanya Exp spl at 17.45 hrs today, Alert LP Sri D.Dorai & ALP Sri P. Kumar noticed One Tusker adjacent to track at KM 72/1 between Nagrakata-Chalsa & applied Emergency brake to control the train & save it. @RailNf@RailMinIndia @wti_org_india pic.twitter.com/TVyXt8HY9H
— DRM APDJ (@drm_apdj) August 25, 2021