UP Elections | బికినీ గర్ల్, మోడల్ అర్చన గౌతమ్ వ్యవహారం యూపీ రాజకీయాలను కుదిపేస్తోంది. బికినీ గర్ల్ అర్చన గౌతమ్కు కాంగ్రెస్ టిక్కెటివ్వడంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. కాంగ్రెస్కు ఎవరూ అభ్యర్థులు లేకే, పనికిమాలిన ప్రచారం కోసం ఇలాంటి వారికి ఇస్తోందని బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి తీవ్రంగా ఆరోపించారు. ఎప్పుడూ వార్తల్లో ఉండడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోందంటూ దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్కు ఏ కోషానా కనిపించడం లేదని, అందుకే సీరియస్గా లేని వ్యక్తులకు టిక్కెట్లిస్తోందని ఆరోపించారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని, కాంగ్రెస్కు సరైన పరిపక్వత లేదనడానికి ఇదో ఉదాహరణ అని త్రిపాఠి దెప్పి పొడిచారు.
ఇక హిందూ మహాసభ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడింది. సంత్ మహాసభ చీఫ్ చక్రపాణి స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. మానసికంగా దివాళా తీసిన పార్టీ నుంచి ఇంతకు మించి ఆశించలేమని నిప్పులు కక్కారు. ఎవరైనా ప్రజా జీవితంలోకి వస్తున్నారంటే వారికి మన సంస్కృతిపై అంతో ఇంతో తెలిసి వుండాలి. హిందూ, హిందుత్వకు భేదం చెప్పే కాంగ్రెస్ చేసిందేమి? ఇలాంటి వారిని బరిలోకి దింపుతారా? సరైన మానసిక పరిపక్వత లేని పార్టీ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం? రేపు క్రిమినల్ నేపథ్యం ఉన్న వారిని కూడా బరిలోకి దింపుతారు. ఓట్ల కోసం ఎంత కిందికైనా దిగిజారుతారు కాంగ్రెస్ నేతలు అని చక్రపాణి స్వామి విమర్శించారు.
బికినీ గర్ల్ అర్చన గౌతమ్కు టిక్కెట్ ఇవ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ మాట్లాడుతూ.. ఓ నటిని బరిలోకి దింపినంత మాత్రాన రాజకీయాలకు వచ్చే ముప్పు ఏమైనా వుందా? అంటూ ప్రశ్నించారు. ఆమెకు రాజకీయాలంటే ఆసక్తి వుంది కాబట్టే టిక్కెట్ ఇచ్చామని స్పష్టం చేశారు. బీజేపీలో కూడా అనేక మంది నటులు ఉన్నారని, వారు మంత్రులు కూడా అయ్యారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఆలోచనా రీతి ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఇదో మచ్చు తునక అని అశోక్ సింగ్ మండిపడ్డారు.
తనకు టిక్కెట్ ఇవ్వడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి అర్చన గౌతమ్ తీవ్రంగా మండిపడ్డారు. నటన, మోడలింగ్ అనేది తన వృత్తి అని, దానిని రాజకీయాలతో జోడించడం ఏమాత్రం బాగో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తి, రాజకీయం వేరని, కలిపి చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నటి, మోడల్ అర్చన గౌతమ్ 2021 లో కాంగ్రెస్లో చేరారు. యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆమెను ఎన్నికల బరిలోకి దింపనుంది. మీరట్లోని హస్తినాపూర్ టిక్కెట్ కేటాయించారు.