న్యూఢిల్లీ : సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్ బిల్లుపై ఇదివరకు లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెలిపాయి. సవరించిన వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులతో సీనియర్ బీజేపీ మంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. ఆలోగా వక్ఫ్ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సవరించిన వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.