Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఐ ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విచారణను మమత అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది అసాధారణమైన కేసు. ఈడీ విచారణలో జోక్యం చేసుకుని అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థన ప్రమాదంలో నెట్టడమే. ఇది కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య జరిగిన వివాదం కాదు. ఒక విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి దాన్ని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఒక విచారణను నేరుగా ఒక ముఖ్యమంత్రి అడ్డుకునే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం వ్యవస్థనే సీఎం ప్రమాదంలోకి నెట్టారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. గత జనవరిలో కోల్కతాలోని ఐప్యాక్ సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. అయితే, ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆ దాడిని అడ్డుకున్నారు. దాడి జరుగుతున్న ప్రతీక్ ఇంటికి వెళ్లి.. అక్కడి కీలక డాక్యుమెంట్లను మమత స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఐప్యాక్ ఆఫీస్ నుంచి కూడా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సమయంలో ఈడీ దాడుల్ని మమత ఖండించారు. అయితే, మమత చర్యను వ్యతిరేకిస్తూ ఈడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ అంశంలో మమతకు వ్యతిరేకంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇది బెంగాల్ ఎన్నికలకు ఒక రోజు ముందు కావడం విశేషం. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23, గురువారం జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగుతాయి.