న్యూఢిల్లీ/మాస్కో: భారత్లో జరుగనున్న జీ20 సమ్మిట్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. అయితే ఈ సదస్సులో వర్చువల్గా ఆయన పాల్గొంటారని తెలుస్తున్నది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. జీ20 సమ్మిట్కు పుతిన్ స్వయంగా హాజరయ్యే ప్రణాళికలు ఏమీ లేవని తెలిపారు. వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొనడాన్ని తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరుగనున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆ దేశం శుక్రవారం స్పష్టం చేసింది.
కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ అరెస్ట్ కోసం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో అరెస్ట్ భయం వల్ల ఆయన విదేశాల్లో ప్రయాణించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని
జోహన్నెస్బర్గ్లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అయితే వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. జీ20 సమ్మిట్లో కూడా వర్చువల్గానే పాల్గొంటారని తెలుస్తున్నది.