Amartya Sen | కోల్కతా: ఆయన ప్రముఖ తత్వ శాస్త్రవేత్త.. నోబెల్ బహుమతి సాధించిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త.. సంక్షేమ అర్థశాస్ర్తానికి కొత్త రూపం ఇచ్చిన ఘనుడు.. ఆయనే అమర్త్యసేన్. అంతటి గొప్ప శాస్త్రవేత్తకు వరుస అవమానాలు ఎదురవుతున్నాయా? దేశంలో జీవించకూడదన్న రీతిలో ఆయనపై కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నుతున్నాయా? అంటే ఇటీవలి పరిణామాలు అవునంటున్నాయంటున్నారు విశ్లేషకులు. గెంటేస్తాం! అంటూ ఆయనకు నోటీసులు జారీ చేయటమే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. శాంతినికేతన్లో ఆయన ఇంటికి ఆనుకొని ఉన్న ప్లాట్ను మే 6లోగా ఖాళీ చేయాలని, లేకపోతే బయటకు గెంటేయాల్సి వస్తుందని విశ్వభారతి యూనివర్సిటీ ఆయనను అవమానించేలా నోటీసులు జారీ చేసింది. పబ్లిక్ ప్రిమిసెస్ యాక్ట్, 1971 సెక్షన్ 1, 5 కింద జాయింట్ రిజిస్ట్రార్, విశ్వభారతి ఎస్టేట్ కార్యాలయం ఈ నోటీసు ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి 15 రోజుల్లోగా లేదా, మే 6 లోగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన ప్లాట్ను ఖాళీ చేయాలని హెచ్చరించింది. అమర్త్యసేన్కు చెందిన ఇంటికి నోటీసును అంటించిన వారంలోపే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న అమర్త్యసేన్కు రెండో నోటీసును జారీ చేసింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన సెంట్రల్ యూనివర్సిటీకి, అమర్త్యసేన్కు 13 డెసిమల్స్ భూమి (5662 చదరపు అడుగులు) విషయమై వివాదం నడుస్తున్నది. తన తండ్రి ఆ స్థలాన్ని తొలుత లీజుకు తీసుకుని తర్వాత దాన్ని యూనివర్సిటీ అధికారుల నుంచి కొనుగోలు చేసినట్టు అమర్త్యసేన్ చెప్తుండగా, అమర్త్యసేన్ తాను ఇప్పుడుంటున్న ఇంటికి అదనంగా యూనివర్సిటీకి చెందిన 13 డెసిమల్స్ భూమిని ఆక్రమించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ ప్లాట్లో తమ కుటుంబం 1943 నుంచి నివసిస్తున్నదని, తన తల్లిదండ్రుల మరణం తర్వాత అది తనకు వారసత్వంగా సంక్రమించిందని, తనకు దగ్గరలోనే అశుతోష్, అమితసేన్ కూడా భూమిని కొనుగోలు చేశారని ఈ నెల 17న అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 80 ఏండ్లుగా తాము అక్కడే ఉంటున్నామని, మేజిస్ట్రేట్ సైతం తాను ఉంటున్న స్థలాన్ని గుర్తించి, ఇందులో అధికారుల జోక్యం, శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించే చర్యలను అంగీకరించనని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తాను జూన్లో భారత్కు వస్తానని తెలిపారు.
అమర్త్యసేన్ 13 డెసిమల్స్ స్థలాన్ని ఆక్రమించారని, దానిని వెంటనే ఖాళీ చేయాలంటూ గత ఏడాది జూన్ నుంచి విశ్వభారతి నోటీసులు పంపిస్తున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ఏడాది జనవరిలో అమర్త్యసేన్ ఇంటిని సందర్శించారు. భూమికి సంబంధించిన రికార్డులను జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో సేన్కు అందజేశారు. ఇప్పుడుంటున్న ఇల్లు 13 డెసిమల్స్ స్థలంతో కలిపి 138 డెసిమల్స్ (1.3 ఎకరా) అమర్త్యసేన్కే చెందుతాయని, ఆ మేరకు నిర్ధారించే పత్రాలు అందజేస్తున్నామని ఆ సందర్బంగా ఆమె ప్రకటించారు. నోబెల్ బహుమతి పొందిన వ్యక్తితో ప్రవర్తించే తీరు ఇదేనా? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మమత తనకు అండగా నిలవటంపై అమర్త్యసేన్ సంతోషం వ్యక్తం చేశారు.
Amartya Sen | వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర.. తేల్చి చెప్పిన అమర్త్యసేన్