Amartya Sen | వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కూటమి ఏర్పాటు కావాలని కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ)లతోపాటు పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ద్విముఖ పోటీలతో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చునని ఆ పార్టీల నేతలు ఉద్ఘాటించారని పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమర్త్యసేన్ చెప్పారు. భారత (తెలంగాణ) రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
`భారత్ విజన్ను బీజేపీ గణనీయంగా దెబ్బ తీసింది. భారత్ అంటే హిందీ మాట్లాడే హిందూ ఇండియా అనే సంకుచిత భావాన్ని బలంగా తీసుకెళ్తున్నది. భారత్లో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోతే అది బాధాకరం` అని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. `ఒకవేళ బీజేపీ చూడటానికి బలంగా, శక్తిమంతంగా కనిపిస్తున్నా.. దాన్ని ఢీ కొట్టేందుకు చాలా బలహీనతలు ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీలు నిజంగా కష్టపడి పని చేస్తే బీజేపీని ఢీ కొట్టగలవని భావిస్తున్నా. బీజేపీని అధికారం నుంచి దించివేసేందుకు దాని ప్రత్యర్థి పార్టీలు కలిసి పని చేస్తాయా? అన్న సంగతి నాకు తెలియదు` అని పేర్కొన్నారు.
`నాకు తెలిసినంత వరకు ప్రాంతీయ పార్టీలు ముఖ్యం అన్నది స్పష్టం. డీఎంకే ముఖ్యమైన పార్టీ అనుకుంటున్నా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముఖ్యమే. బీజేపీకి వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కొంత వరకు నిలబడుతున్నది. ఇలా ఎస్పీ ఎంత వరకు నిలబడుతుందో చెప్పలేం. మొత్తం భారత్పై `హిందువుల మార్గదర్శకత్వం` అనే విజన్తో వెళుతున్న బీజేపీని ఏ పార్టీ ఎదుర్కోలేకపోతే 2024 ఎన్నికల్లో అది పొరపాటవుతుంది` అని అమర్త్యసేన్ స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల పోరులో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం సందేహమేనని అమర్త్యసేన్ పేర్కొన్నారు. బలహీన పడిన పార్టీగా భావిస్తున్నా.. దేశమంతటికీ అఖిల భారత స్థాయి విజన్ అందించగల పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. `కాంగ్రెస్ బలహీనపడినట్లు కనిపిస్తున్నది. ఎంతమంది కాంగ్రెస్పై ఆధార పడతారో నాకు తెలియదు. మరే ఇతర పార్టీల కంటే కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అఖిల భారత విజన్ అందించగలదు. కానీ, ఆ పార్టీలోనే విభేదాలు ఉన్నాయి` అని అన్నారు.