Viral fever | కేరళ (Kerala) రాష్ట్రంలో విషజ్వరాలు (Viral fever) ఆందోళన కలిగిస్తున్నాయి. గత 10 రోజులుగా రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రోజుకు 10 వేల మందికి పైగా ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సోమవారం ఒక్కరోజే 13 వేల మంది జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. జూన్ నెల ప్రారంభం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అంటు జ్వరాల వ్యాప్తి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,346 మంది చికిత్స పొందినట్లు తెలిపారు. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కంటే.. ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్యే రెట్టింపుగా ఉంది.
వైరల్ ఫీవర్స్ తోపాటు డెంగీ (dengue), మెదడు వాపు కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 110 మంది డెంగీ బారిన పడినట్లు తేలింది. మరో 218 మందికి డెంగీ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా డెంగీ రోగులు ఎర్నాకులం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఆ జిల్లాకు చెందిన 43 మందికి డెంగీ నిర్ధారణ కాగా, మరో 55 మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1,011 మంది డెంగీ బారిన పడ్డారు.
మరోవైపు మెదడువాపు (leptospirosis) వ్యాధి బారిన పడే రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే ఎనిమిది మందికి మెదడు వాపుగా తేలింది. మరో 14 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. ఈనెలలో ఇప్పటి వరకూ 76 మందికి మెదడు వాపు వ్యాధి సోకగా.. మరో 116 మందిలో లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. రోగాలు ఇతరులకు వ్యాపించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. అవసరమైన మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆసుపత్రులను ఆదేశించింది. ప్రతి ఆసుపత్రిలోనూ సిబ్బందితోపాటు వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపింది.
Also Read..
Karnataka High Court | భార్యతో శారీరకసంబంధాన్ని నిరాకరించడం నేరం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
Kedarnath Temple | కేదార్ నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ
Hardik Pandya | వదినకు రూ.లక్ష కాదు.. రూ. 5 లక్షలు ఇస్తా.. పాండ్యా పెళ్లి వీడియో వైరల్