Manipur | ఇంఫాల్, జూన్ 14: వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నెలన్నరోజులుగా రావణకాష్టంలా తయారైంది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నా ఇటు మోదీ సర్కార్, అటు బీరేన్సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. తాజాగా ఖేమ్లాక్ గ్రామంలో మిలిటెంట్స్, గ్రామ వాలంటీర్స్కు మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో 11మంది మృతి చెందగా, 23మంది గాయపడ్డారు. ఓ మహిళా మంత్రి అధికారిక నివాసానికి మిలిటెంట్స్ నిప్పుపెట్టారు. పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసుల్ని అక్కడ మోహరించినా కుకీ సామాజికవర్గం ఇండ్లపై మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారంటే..పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో తీసుకున్న చర్యలేవీ క్షేత్రస్థాయిలో ఫలించలేదు.ఈనేపథ్యంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఖేమ్లాక్లో కుకీ సామాజికవర్గం ఇండ్లపై కొంతమంది దుండగులు మంగళవారం అర్ధరాత్రి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. పలువురి ఇండ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కనీసం 11మంది చనిపోయారని, మరో 23మంది తీవ్రంగా గాయపడ్డారని ఓ పోలీస్ అధికారి బుధవారం వెల్లడించారు. చనిపోయినవారిలో ఒక మహిళ ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్రంలో మే 3 నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మైతీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా ఇవ్వటాన్ని నాగాలు, కుకీ సామాజికవర్గానికి చెందిననారు వ్యతిరేకిస్తున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో దాదాపు 120మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 350మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. 50వేలమందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ఇప్పటివరకూ స్పందించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ స్వార్థ రాజకీయమే జాతుల మధ్య రిజర్వేషన్ చిచ్చు రాజేసిందని ఆరోపిస్తున్నాయి. అమాయక పౌరులు చనిపోతున్నా ప్రధాని మోదీ మౌనం వీడకపోవటం దారుణమని పేర్కొన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో అమిత్ షా, రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని, మణిపూర్ హింసకు మోదీ సర్కార్ బాధ్యత వహించాలని అరోపించాయి. ఓ చిన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు అన్నారు. మహిళలు, పౌరుల ప్రాణాల్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాపాడలేకపోయిందన్నారు.