న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా. రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా ఎక్స్లో చెప్పారు.
Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.
Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…
— Narendra Modi (@narendramodi) July 14, 2024
బుల్లెట్ నా కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది: ట్రంప్
అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దుండగుల కాల్పుల్లో తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందని చెప్పారు. కాల్పుల శబ్దం వినగానే ఏదో తేడాగా ఉందని అర్ధమైందన్నారు. బుల్లెట్ తన చెవిని తాకుతూ దూసుకెళ్లిందని, దీంతో తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి ట్రూత్ సోషల్ సైట్లో వెల్లడించారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ఆయన స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా చేరారు. వేదిక పైనుంచి దించి దవాఖానకు తరలించారు. అనంతరం స్టేజీ పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కాగా, కాల్పుల ఘటనపై అమెరికా భద్రతా సిబ్బందితో కలిసి ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది. ట్రంప్పై దాడి జరిగిన ప్రాంతంలో విచారణ నిర్వహిస్తున్నది. అనుమానితులు, ప్రత్యక్ష సాక్ష్యులను అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.