కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని హౌరా ప్రాంతంలో ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం హింస చోటుచేసుకుంది. జగత్ వల్లభపూర్ లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం కర్రలతో దాడికి తెగబడిన వీడియో వైరల్ గా మారింది. గుంపులో ఓ వ్యక్తి గన్ తో హల్చల్ చేయడం కలకలం రేపింది. క్యూలో నిలుచున్న ప్రజలను పక్కనపెట్టి ప్రత్యేకంగా కొందరికి వ్యాక్సిన్ ఇస్తున్నారనే ఆరోపణలతో దుమారం రేగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
వీడియోలో గన్ తో కనిపించిన వ్యక్తి తృణమూల్ కార్యకర్తని బీజేపీ ఆరోపించగా పాలక తృణమూల్ కాషాయ పార్టీ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకే వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇస్తూ తమ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించింది. మరోవైపు బెంగాల్ లో కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌన్ నియంత్రణలను సడలించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వ్యాక్సినేషన్ పూర్తయిన సిబ్బందితో రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతిస్తామని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రంలో 1.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇప్పటివరకూ అందించామని దీదీ చెప్పారు.