(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. మీటర్లు వద్దంటూ ఆగ్రా జిల్లాలోని మహిళలు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. మీటర్లను నెత్తి మీద పెట్టుకొని అకోలాలోని దేవీ మందిరం నుంచి స్థానిక విద్యుత్తు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను అమర్చినప్పటి నుంచి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయని మండిపడ్డారు. బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరాలోనూ తరుచుగా సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో పాత మీటర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ర్యాలీలో భాగంగా తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లను అకోలాలోని విద్యుత్తు కార్యాలయం ఎదుట కుప్పలుగా పోసిన మహిళలు.. స్థానికులతో కలిసి వాటిని ధ్వంసం చేశారు. మీటర్లు తీసివేయాలంటూ స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతోనే ఇలా చేసినట్టు చెప్పారు. తమకు తెలియకుండా మీటర్లను ప్రీ పెయిడ్గా మార్చడమే కాకుండా.. గతంతో పోలిస్తే, తమకు ఎక్కువ బిల్లులు వేస్తున్నారంటూ నోయిడాతో పాటు పలు జిల్లాల ప్రజలు కరెంట్ ఆఫీసుల ముందు గతవారం పెద్దయెత్తున నిరసనలు తెలిపారు.
ఎవుసం చేసే బాయి దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్మీటర్’ ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. అయినప్పటికీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీరు మారట్లేదు. కేంద్రం వైఖరిని తప్పుబడుతూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వివిధ రాష్ర్టాల్లో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. వేలల్లో బిల్లులు వస్తున్న ఈ స్మార్ట్మీటర్లు తమకు వద్దంటూ యూపీలోని బాగ్పత్ జిల్లాలో ఉన్న రాథోడా గ్రామ రైతులు.. పశ్చిమ్ విద్యుత్ విట్రన్ నిగం లిమిటెడ్ (పీవీవీఎన్ఎల్) కార్యాలయం ముందు మీటర్లను కుప్పలుగా పోశారు. స్మార్ట్మీటర్లు బిగించినప్పటి నుంచి వారానికి రూ. 8 వేల దాకా బిల్లులు వస్తున్నాయని బుధానా కరెంటు ఆఫీసులో మీటర్లను కుప్పలుగా పోసి ఉమర్పూర్ రైతులు ఆందోళనలను తీవ్రం చేశారు. మీటర్లను ఊడ బీకిన మీరట్ రైతులు.. విద్యుత్తు ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. స్మార్ట్ మీటర్లు పెట్టినప్పటి నుంచి తమకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని బీహార్లోని నందలాల్పూర్, మిల్లీచక్, బహదూర్పూర్, ఐనాయత్పూర్, రోస్రా, సమస్తీపూర్ తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే నిరసనలు తెలిపారు.