నాందేడ్ : కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని దేశమంతటా అమలవుతాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గం కిని గ్రామంలో గురువారం పర్యటించారు. రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ త్వరలోనే నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు బీఆర్ఎస్ ను స్థాపించారని వివరించారు. మహారాష్ట్రలో ఊరూరా బీఆర్ఎస్ విస్తరిస్తామని, ప్రతీ జిల్లాలో తాలూకా, గ్రామస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు బీఆర్ఎస్ తరహా పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. దేశంలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నా అనుకున్న స్థాయిలో దేశంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు ద్వారా సంవత్సరానికి రూ. 10వేల పెట్టుబడి, చనిపోయిన రైతుకు రైతుబీమా ద్వారా రూ. 5లక్షలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు.
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తున్నదని, ఐటీ, ఫార్మా ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు.అందకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాలజ్ కర్ర వినాయకున్ని దర్శించుకుని , ప్రత్యేక పూజలు చేశారు.నాందేడ్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు రమేశ్ రాథోడ్, సునీల్ కుమార్ బజాజ్, అశోక్ రాథోడ్ తదతరులు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు.