చెన్నై : కరోనా నుంచి కోలుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులో చేరాడు. మహమ్మారి బారినపడిన ఈ ఆల్ రౌండర్ దాదాపు మూడు వారాల పాటు ముంబైలోని మెడికల్ కేర్ ఫెసిలిటీలో చికిత్స తీసుకున్నాడు. మార్చి 28న ముంబైలోని టీం హోటల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో జట్టుతో చేరాడు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో మళ్లీ ఈ నెల 3న టెస్టులు చేయగా.. వైరస్ పాజిటివ్గా తేలింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫెసిలిటీకి తరలించగా.. కోలుకున్నాడు. ఈ మేరకు ఆల్రౌండర్ టీమ్తో కలిసిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. ‘ఆద్మీ దేఖ్ కే హి తోహ్ ముజే మజా ఆ రహా హై’ అని వీడియోలో పేర్కొన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తర్వాత వైరస్ బారినపడ్డ రెండో క్రికెటర్ అక్షర్పటేల్. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే ఆదివారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.