న్యూఢిల్లీ: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారె 90వ జయంత్రి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. సాహితీ ప్రపంచంలో సినారెది ప్రత్యేక స్థానమని, ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయన్నారు. తెలుగు కవుల్లో సినారెను ఎంతగానో అభిమానిస్తానని అన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
‘ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) గారి 90వ జయంతి సందర్భంగా ఆ సాహితీమూర్తి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీ ప్రపంచంలో వారి స్థానం ప్రత్యేకమైనది. నేను అత్యంత అభిమానించే తెలుగు కవుల్లో సినారె తొలి వరుసలో ఉంటారు. రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాల మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినారె గారిని తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది’ అని వెంకయ్య ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.