ఇంట్లో ఉన్న జంతువుకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ చేసిందా కుటుంబం. దాంతో మూగజీవిని కాపాడటం కోసం గబగబా అన్నీ సర్దుకొని ఆ ఇంటి ముందు వాలిపోయాడో వెటర్నరీ డాక్టర్. అంతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. అతన్ని నోరు మూసి కిడ్నాప్ చేశారు. బలవంతంగా తమ ఇంటి అమ్మాయికిచ్చి పెళ్లి చేసేశారు.
ఈ ఘటన బిహార్లోని బెగుసరాయ్ ప్రాంతంలో వెలుగు చూసింది. ‘‘మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏదో జంతువుకు ఒంట్లో బాగలేదని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని ముగ్గురు వచ్చి కిడ్నాప్ చేశారు. తను తిరిగి రాకపోవడంతో ఇంట్లో అందరం చాలా టెన్షన్ పడిపోయి పోలీసులను ఆశ్రయించాం’’ అని సదరు డాక్టర్ బంధువులు చెప్తున్నారు.
ఇలాంటి ఘటనలు బిహార్లో చాలా జరుగుతుండటం గమనార్హం. ‘‘పకడ్వా వివాహ్’’ అనే పేరుతో పిలిచే ఈ పెళ్లిళ్లలో.. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను ఇలా కిడ్నాప్ చేసి, తమ పిల్లలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఈ క్రమంలో అబ్బాయిల తలలపై తుపాకులు గురిపెట్టి తాళి కట్టిస్తుంటారు కూడా.
ఇటీవల ఇలాగే బలవంతంగా పెళ్లి చేస్తుంటే.. వరుడి దుస్తుల్లో ఉన్న యువకుడు ఏడ్చి గగ్గోలు పెడుతూ, తనను వదిలేయమని ప్రాధేయపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.