భువనేశ్వర్: బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ త్రిలోచన్ కనుంగో (82) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత నెల 30న ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. 20 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నా ఆయన ఏమాత్రం కోలుకోలేదు.
త్రిలోచన్ కనుంగో 1971లో తొలిసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1974, 1985 ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1999లో జగత్సింగ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు.