KC Venugopal : విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ, ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో సంప్రదింపులు సాగుతున్నాయని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు.
ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే వివరాలు ఏ క్షణమైనా ఖరారవుతాయని కాంగ్రెస్ సంస్ధాగత ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంప్రదింపుల కోసం జాతీయ అలయన్స్ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ తన విధులను నిర్వర్తిస్తోందని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని పరిష్కారం దిశగా చర్చలు తుది దశకు చేరాయని చెప్పారు.
మరోవైపు బెంగాల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, పంజాబ్లో ఒంటరి పోరుకు సిద్ధమని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే ఆయా పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కేసీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.