తిరుమల : ముంబై (Mubai) మహానగరంలోని తూర్పు దోంభివలి ప్రాంతంలో వేంకటేశ్వర స్వామి (Venkateshwara Swamy) వారి కల్యాణం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయంలో ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, టీటీడీ నిర్వహిస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని అభినందించారు. స్వామివారి కల్యాణం లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణోత్సవం లో టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఎంపీ శ్రీకాంత్ షిండే, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.