న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో వణుకుతున్న భారత్ లో కొవిడ్-19 కట్టడి కోసం రూ 150 కోట్ల అదనపు సాయానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. గత ఏడాది కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వేదాంత గ్రూప్ రూ 201 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పదినగరాల్లో 1000 పడకలు అదనంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని వేదాంత ఓ ప్రకటనలో పేర్కొంది.
అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఫీల్డ్ ఆస్పత్రుల్లో ఈ అదనపు పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏసీ టెంట్ లతో 100 పడకలతో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రముఖ ఆస్పత్రులతో వీటిని అనుసంధానం చేస్తామని వెల్లడించింది. కరోనా వ్యాప్తితో పడకలు, వైద్య పరికరాల కొరతను కొంతవరకైనా అధిగమించేందుకు ఇవి ఉపకరిస్తాయని వేదాంత ఆశాభావం వ్యక్తం చేసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం అత్యవసర వైద్య పరికరాలను సమకూరుస్తామని పేర్కొంది.