వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు కార్బన్ డేటింగ్ (వయసు నిర్ధారణ) పరీక్షలను నిర్వహించేందుకు వారణాసి కోర్టు శుక్రవారం అంగీకరించింది. శివలింగ నిర్మాణం ఉందని భావిస్తున్న ప్రదేశం తప్ప మిగిలిన మసీదు అంతా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా శాస్త్రీయ సర్వేను జరపాలని ఆదేశించింది. ఏఎస్ఐ తన ప్రాథమిక నివేదికను ఆగస్టు 4లోగా అందజేయాలని పేర్కొంటూ కేసును ఆ రోజుకు వాయిదా వేసింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో పురావస్తు శాఖతో సర్వే నిర్వహించాలంటూ హిందూ సంస్థల తరపున విష్ణుశంకర్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ సమాధానం దాఖలు చేయాలంటూ న్యాయస్థానం మసీదు కమిటీని ఆదేశించింది. శుక్రవారం ఇరువర్గాల వాదనను విన్న కోర్టు శాస్త్రీయ సర్వేకు అంగీకరిస్తూ తీర్పు చెప్పింది. శాస్త్రీయ సర్వేకు గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపివేసింది.