న్యూఢిల్లీ, జూలై 27: వచ్చే నెలలో పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. పిల్లలపై కరోనా థర్డ్వేవ్ ఎక్కువ ప్రభావం చూపనున్నదన్న అంచనాల నేపథ్యంలో తాజా ప్రకటన ఊరట కలిగిస్తున్నది. పిల్లల కోసం భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే, నిపుణులను సంప్రదించి పిల్లల వ్యాక్సినేషన్పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం 18 ఏండ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం తెలిసిందే.
ఏ టీకాలు రావొచ్చు?
భారత్ బయోటెక్ సంస్థ పిల్లల కోసం అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా గతవారం తెలిపారు. 2-17 ఏండ్ల వయసు పిల్లలపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయి. మరోవైపు, పిల్లల కోసం జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన టీకా ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.
పిల్లలపై కొవొవాక్స్ ట్రయల్స్కు అనుమతివ్వండి
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు చెందిన కొవొవాక్స్ టీకాను 2-17 ఏండ్ల వయసున్న పిల్లలపై 2, 3 దశ ట్రయల్స్ జరిపేందుకు అనుమతులు ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)కు చెందిన నిపుణుల కమిటీ ఔషధ నియంత్రణ మండలికి సిఫారసు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్ అనే ఫార్మా సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది.